21.01.2025.
నెల్లూరు.

స్విట్జర్లాండ్‌లోనూ అవే పనికిమాలిన కబుర్లు.. విమర్శలు
జగన్‌ని తిట్టడానికే తండ్రీకొడుకులు దావోస్‌ వెళ్లినట్లుంది
:మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపణ

నెల్లూరులో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ జిల్లా అ«ధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి.

రాజకీయ ప్రసంగాలు, సొంత భజన కోసం అంత దూరం వెళ్లాలా?
సొంత ప్రయోజనాల కోసం ప్రజల సొమ్ము ఖర్చు చేయడం తగదు
ప్రజలు తిడతారనే సోయ లేకుండా చంద్రబాబు అబద్ధాలు
హైదరాబాద్‌ అభివృద్ధి తానే చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటు
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరే నాటికి చంద్రబాబు సీఎం కాలేదు
:స్పష్టం చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నారా లోకేశ్‌కి బొత్తిగా రాజకీయ పరిజ్ఞానమే లేదు
2004లో చంద్రబాబు సీఎం అయ్యుంటే రాష్ట్రం వల్లకాడయ్యేది
‘ఓటుకు కోట్లు’ కేసులో దొరికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఘనుడు చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి జరిగిన మేలు ఒక్కటీ లేదు
:ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ

నెల్లూరు:
పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి దావోస్‌ వెళ్లిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌ సొంత భజన చేసుకోవడమే కాకుండా, వారు చెప్పే పచ్చి అబద్ధాలు చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. గతంలో 2014–19 మధ్య నాలుగుసార్లు దావోస్‌ వెళ్లిన చంద్రబాబు, ఆర్భాట ప్రకటనలు, ప్రచారం మినహా సాధించేదేమీ లేదని, రాష్ట్రానికి కనీసం ఒక్క పెట్టుబడి కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. అందుకే ఈసారైనా తప్పుడు ప్రకటనలతో మోసం చేయకుండా, పెట్టుబడుల విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి కోరారు.

ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

తండ్రీ కొడుకుల ఆత్మస్తుతి..పరనింద:
పెట్టుబడుల ఆకర్షణ పేరుతో దావోస్‌ వెళ్లిన తండ్రీకొడుకులు అసలు విషయం పక్కన పెట్టి ఒకరికొకరు భజన మొదలుపెట్టారు. మంత్రులు లోకేశ్‌ను పొగడటం.. లోకేశ్‌.. చంద్రబాబుని పొగడటమే సరిపోయింది. అది చాలదన్నట్టు ఇద్దరూ కలిసి జగన్‌ని తిట్టడం. ఈ మాత్రం దానికి కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి దావోస్‌ దాకా వెళ్లడం దేనికని జనం తిట్టుకుంటున్నారు.

నాడు ఓడిపోకపోయి ఉంటే..:
2004లో ఒకవేళ చంద్రబాబు గెలిచి ఉంటే రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలయ్యేది. అనావృష్టి కారణంగా రైతుల మరణాలతో వల్లకాడుగా మారేది. ఆరోజున వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యారు కాబట్టే రైతుల బతుకులు బాగుపడ్డాయి. వైఎస్సార్‌ సీఎం అయ్యారు కాబట్టే రైతులకు ఉచిత విద్యుత్‌ వచ్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ వైద్యం అందింది. పేదలకు ఇళ్లు వచ్చాయి. 108 అంబులెన్స్‌లు, ఫీజు రీయింబర్స్‌పథకం వచ్చింది.
2004 నాటికే 54 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు ప్రైవేటుపరం చేశాడు. ఆయన ఓడిపోయాడు కాబట్టే ఆర్టీసీ బతికిపోయింది. వైఎస్సార్‌ రావడం వలనే రైతులు, యువత, ఉద్యోగులు, విద్యార్థులు అందరి జీవితాలు బాగుపడ్డాయి.

హైదరాబాద్‌ అభివృద్ధిపై ఇంకా అబద్ధాలా?:
చంద్రబాబు సీఎంగా రాష్ట్రానికి చేసిన మేలు ఒక్కటైనా ఉందా? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి అమరావతికి వచ్చేశాడు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నిరుద్యోగం పెంచారు. రుణమాఫీ చేస్తామని రైతులను వంచించారు.
హైదరాబాద్‌ను తానే అభివృద్ది చేశానని విదేశాలకు వెళ్లినా జంకూబొంకూ లేకుండా, ప్రజలు అసహ్యించుకుంటారని ఆలోచించకుండా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. నిజానికి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది వైఎస్సారే.. చంద్రబాబుకి జన్మజన్మలకు సాధ్యం కాని ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించారు. భూసేకరణ పూర్తి చేసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మించారు.

బాబు ఏనాడైనా సొంతంగా గెల్చారా?:
చంద్రబాబు నాయకత్వంలో సొంతంగా తెలుగుదేశం పార్టీ ఒక్కసారైనా అధికారంలోకి వచ్చిందా?. 1994 లో ఎన్టీఆర్‌ పార్టీని అధికారంలోకి తెస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు పార్టీని లాక్కున్నాడు. 1999లో బీజేపీ పొత్తులో ఉన్న కారణంగా గెలిచారు. 2004, 2009 పొత్తుల్లో కూడా ఓడిపోయారు. 2014లో పవన్‌ కళ్యాణ్, నరేంద్రమోదీ క్రేజ్‌ కారణంగా అధికారంలోకి వచ్చారు. 2019లో సొంతంగా పోటీ చేస్తే ప్రజలు మళ్లీ తిరస్కరించారు. 2024లో మళ్లీ తిట్టిన మోడీకే జైకొట్టి కాళ్లావేళ్లా పడి పవన్‌ కళ్యాణ్‌ని తెచ్చుకున్నా అడ్డదారిలోనే అధికారంలోకి వచ్చాడు.

సత్యనాదెళ్లనూ వదిలిపెట్టరా?:
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ లో ఉద్యోగం తెచ్చుకోవడానికి నేనే కారణమని సిగ్గు లేకుండా చంద్రబాబు గప్పాలు కొడుతున్నాడు. సత్యనాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరే నాటికి చంద్రబాబు సీఎం కాలేదు. 1998లో మైక్రోసాఫ్ట్‌ తాత్కాలిక స్థలంలో ఏర్పాటైంది. వైఎస్సార్‌ సీఎం అయ్యాకనే ఆ కంపెనీకి 42.25 ఎకరాలు స్థలం కేటాయించి 2004 నవంబర్‌ 15న కంపెనీని ప్రారంభించారు. అమెరికా తర్వాత అతిపెద్ద మైక్రోసాఫ్ట్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌లోనే ఏర్పాటైంది.

దావోస్‌ పెట్టుబడుల ప్రకటనలన్నీ అబద్ధాలే:
2014–19 మధ్య చంద్రబాబు వరుసగా నాలుగేళ్లు, ఆయన కొడుకు లోకేశ్‌ ఒకసారి దావోస్‌ వెళ్లొచ్చారు. ఆ ఐదేళ్లూ పెట్టుబడుల పేరుతో ఎల్లో మీడియాలో ఆహా ఓహో అని డప్పుకొట్టడమే తప్ప.. ఆ పత్రికలు రాసిన ఒక్క ప్రాజెక్టు కూడా వచ్చింది లేదు. ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము ధారబోశారు. ఇది చాలదన్నట్టు ఈసారి జీవోలు ఇచ్చి మరీ నేషనల్‌ మీడియాకి కూడా కోట్లల్లో డబ్బులు ధారబోస్తున్నారు.
స్టోన్‌ క్రాఫ్ట్‌ అనే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థ గోల్ఫ్‌ కోర్టు ఏర్పాటు చేస్తామని దావోస్‌ వెళ్లి లోకేశ్‌తో ఒప్పందం చేసుకుందని చెబుతున్నారు. ఇంతకన్నా చోద్యం ఇంకేదైనా ఉంటుందా? నిరుద్యోగులను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారు?

వాస్తవరూపం దాల్చిన జగన్‌ చేసుకున్న ఒప్పందాలు:
ఏ హంగామా లేకుండా 2022లో సీఎంగా దావోస్‌ సదస్సుకి వెళ్లిన వైఎస్‌ జగన్‌ రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ ఒప్పందాలన్నీ వాస్తవ రూపంలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి.
టెక్‌ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ రూ.200 కోట్లతో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ఆదాని గ్రూప్‌ రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో వస్తే భూములు కేటాయించాం. గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.37 వేల కోట్ల పెట్టుబడులతో వచ్చిన గ్రీన్‌ కో కంపెనీకి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భూములు కేటాయించడం, ఉత్పత్తి కూడా ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఇటీవలే ఆ కంపెనీని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సందర్శించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రాజెక్టు అని ప్రశంసించారు.
ఇవే కాకుండా రూ.28 వేల కోట్లతో అరబిందో సంస్థ గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌కు ఒప్పందం చేసుకుంటే ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి.
ఆయా కంపెనీల కారణంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *