
- *వ్యాపార నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం (ESDP) పురోగతి ఏమిటి? – రాజ్యసభలో శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్*
న్యూఢిల్లీ, మార్చి 30, 2026:
దేశవ్యాప్తంగా వ్యాపార నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం (ESDP) అమలు పురోగతి, నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు, లబ్ధిదారుల సంఖ్య మరియు రాష్ట్రాల వారీ వివరాలపై రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు రాజ్యసభలో ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే గారు సమాధానం ఇస్తూ, 2021–22 నుండి 2025–26 (మార్చి 23, 2026 వరకు) కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 39,280 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 18,25,181 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందినట్లు తెలిపారు.
ఈ పథకం ప్రధాన లక్ష్యం యువతలో స్వయం ఉపాధి, వ్యాపార ప్రారంభంపై ఆసక్తి పెంచడం, ఎంఎస్ఎంఈల సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు వ్యాపార సంస్కృతిని అభివృద్ధి చేయడమని కేంద్రం పేర్కొంది.
రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం అమలు వేగంగా సాగుతోందని వివరాలు సూచిస్తున్నాయి. 2021–22లో 27 కార్యక్రమాలు, 2,295 లబ్ధిదారులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2025–26 నాటికి 575 కార్యక్రమాలు, 30,502 లబ్ధిదారులకు విస్తరించినట్లు అనుబంధ పట్టికలో వివరాలు వెల్లడయ్యాయి.
జిల్లా స్థాయిలో కూడా కార్యక్రమం విస్తరిస్తూ ఉండగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2025–26లో ఒక కార్యక్రమం ద్వారా 100 మంది లబ్ధిదారులు శిక్షణ పొందినట్లు వివరాలు సూచిస్తున్నాయి.
నిధుల విషయానికొస్తే, ఈ పథకం కింద గత ఐదేళ్లలో మొత్తం ₹277.02 కోట్లు కేటాయించగా, ₹266.67 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
ఈ సందర్భంగా శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు మాట్లాడుతూ, వ్యాపార నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువతలో స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను మరింత విస్తరించి యువతను వ్యాపార రంగంలోకి తీసుకురావాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
—*శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారి కార్యాలయం, నెల్లూరు*