
రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి నారాయణ
– ధైర్యంగా ఉండాలని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి భరోసా
– నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ
నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు మృతిచెందగా, మరి కొంతమందికి తీవ్ర గాయాలైన సంఘటన విషాదాన్ని నెలకొల్పింది. ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు హుటాహుటిన మంగళవారం విజయవాడ నుండి నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. వారితో మంత్రి నారాయణ మాట్లాడి వివరాలు అడిగారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు మంత్రి సూచించారు. మృతిచెందిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు ఎన్టీఆర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించి ధైర్యం చెప్పానన్నారు. ప్రమాదంలో సిరీ గార్డెన్ కి చెందిన తండ్రి కొడుకులు ఖాజీ నజాం మొహిద్దీన్ షేక్ , ముజాహిద్దీన్ ఆలీ షేక్ లతో పాటు సురేష్ అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. ముజాహిద్దీన్ ఆలీ షేక్ నెల్లూరు కార్పొరేషన్ లో శానిటరీ సెక్రెటరీగా పనిచేస్తున్నారన్నారు. అలాగే రోడ్డుపక్కన మొక్కజొన్న కంకులు అమ్ముకునే ఎన్టీఆర్ నగర వాసి మల్లిక, స్టోన్ హౌస్ పేటకు చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి కొండయ్య , కంకులు కొనేందుకు వెళ్లిన ఇందుకూరుపేట వాసి విధ్యుత్ లైన్ మాన్ ఈదూరు అనీల్ లు తీవ్రంగా గాయపడ్డారని వారిని పరామర్శించినట్లు తెలియజేశారు. ముగ్గురికి మెరుగైన వైద్యం అందజేస్తున్నామన్నారు. క్షతగాత్రుల కుటుంబానికి భరోసాగా ఉంటామని తెలియజేశారు. ఆ దిశగా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఆదేశాలు జారీ చేశారు