
*నెల్లూరు జిల్లాకు జల్ సంచయ్ – జన్ భాగీదారీ అవార్డు రావడం ఆనందం కలిగిస్తుంటే…*
*అధికారుల నిర్లక్ష్యానికి కండలేరు డ్యామ్ బలహీన పడటం బాధకలిగిస్తోంది…*
*-బిజెపి నేత మిడతల రమేష్ ..*
నెల్లూరు జిల్లాకు జల్ సంచయ్ – జన్ భాగీదారీ అవార్డు రావడం ఆనందం కలిగిస్తుంటే మరో వైపు అధికారుల నిర్లక్ష్యానికి కండలేరు డ్యామ్ బలహీన పడటం బాధకలిగిస్తోందని బీజేపీ నేత మిడతల రమేష్ అవేదన వ్యక్తం చేశారు. రూ.60 వేల కోట్ల విలువ కలిగిన కండలేరు డ్యామ్ నిర్లక్ష్యానికి గురైందని ఆయన బిజెపి నాయకులతో కలిసి తెలుగుగంగ ఎస్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర రావుకు వినతి పత్రం అందజేశారు. తొలుత తెలుగు గంగ ఎస్సీ కార్యాలయం ఎదుట కండలేరు డ్యామ్ పట్ల
అధికారుల నిర్లక్ష్యానికి బిజెపి నేతలు మౌనం పాటించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మిడతల రమేష్ మాట్లాడుతూ డ్యామ్ రివిట్మెంట్ భాగంలో మరియు మట్టికట్ట బయట భాగంలో పిచ్చిచెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయని అన్నారు. డ్యామ్ సేఫ్టీ సెల్ మట్టికట్టను వెడల్పు చేసి పటిష్టం చేయమని ఆదేశిస్తే అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడం బాధాకరమన్నారు. ఆరు -ఏడు కిలోమీటర్ల మధ్య గ్రౌటింగ్ చేయనందున సిపేజీ కొనసాగుతోందని తెలిపారు. కండలేరు గేట్లు నిర్వహణ నియంత్రణలో లేదని మండిపడ్డారు. ఈ పెండింగ్ పనుల వలన డ్యాం బలహీన పడుతుందోని వివరించారు. వర్షపు నీరు ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపుకు అధికారులు చేసిన కృషి వలన కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు భాగీధారీ అవార్డు అందజేయడం ఆనందం కలిగిస్తుంటే మరో వైపు అధికారుల నిర్లక్ష్యం మూలంగా కండలేరు డ్యామ్ బలహీనపడడం బాధ కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల బీజేపీ అధ్యక్షులు పూల ప్రశాంత్, బీజేపీ సీనియర్ నాయకులు నరాల సుబ్బారెడ్డి, అల్లూరు నాగేంద్ర సింగ్, చిట్టిబాబు, శ్రీనివాసులు, చింతగింజల సుబ్రమణ్యం, మాల్యాద్రి, ఆదినారాయణ, సృజన, రాములు, నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.