
*కలెక్టర్ ప్రత్యేక చొరవతో నిమ్మ రైతులకు ఊరట*
➖ జిల్లాలో నిమ్మ రైతులను ఆదుకునేందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల*
➖ శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి మన జిల్లాలోని నిమ్మ కొనుగోలు చేసేలా చర్యలు
➖ వెంటనే నిమ్మను ఆయా జిల్లాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్
నెల్లూరు, డిసెంబర్ 10 : జిల్లాలో నిమ్మ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చర్యలు చేపట్టారు.
బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో నిమ్మ ధరలు తగ్గిన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ఉద్యానవన మార్కెటింగ్ అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 35000 ఎకరాల్లో నిమ్మ సాగు చేపట్టారని, ఇందులో ఈ సీజన్లో 25 వేల ఎకరాలు కాపునకు వస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నిమ్మ విస్తీర్ణం బాగా పెరిగినందున మన ప్రాంతం నుంచి పంపించే నిమ్మకు డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా తగ్గాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మన రాష్ట్రంలో నిమ్మ డిమాండ్ ఉన్న కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లకు సమావేశం నుంచే ఫోన్ చేసి మాట్లాడారు. నెల్లూరు జిల్లా నుంచి నిమ్మ పంటను ఆయా జిల్లాల్లో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరగా, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు మన జిల్లా నుంచి నిమ్మ పంటను వెంటనే ఆయా జిల్లాలకు పంపించి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిమాండ్ ఉన్న ఇతర జిల్లాలతో కూడా సంప్రదించాలని అధికారులను ఆదేశించారు. నిమ్మ రైతులు నష్టపోకుండా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడి అనిత తదితరులు పాల్గొన్నారు.
*DIPRO, I &PR, NELLORE*