
*తుఫాను వేళ విద్యార్థులకు ‘వీసీ’ భరోసా: “సమస్య ఉంటే నేరుగా నాకే ఫోన్ చేయండి”*: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు*
నెల్లూరు (విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం):
తుఫాను హెచ్చరికలు, ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు విద్యార్థులకు అండగా నిలిచారు. ప్రతికూల వాతావరణంలో విద్యార్థులకు ఎటువంటి లోటు రాకూడదనే దృఢ సంకల్పంతో, బుధవారం ఆయన వర్సిటీలోని మహిళా మరియు బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
*క్షేత్రస్థాయిలో పరిశీలన:*
ఈ పర్యటనలో భాగంగా వీసీ గారు హాస్టల్ గదులు, వంటగది, డైనింగ్ హాల్తో పాటు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేవలం అధికారులను అడగడమే కాకుండా, స్వయంగా విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించి.. వర్షాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు.
*విద్యార్థుల హర్షం:*
వీసీ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సానుకూలంగా స్పందించారు. వసతి గృహాల్లో సౌకర్యాలు బాగున్నాయని, ముఖ్యంగా వర్షాలు పడుతున్నా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదని, వేడివేడిగా నాణ్యమైన ఆహారం అందుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు.
*వ్యక్తిగత నంబర్ ఇచ్చి భరోసా:*
ఈ సందర్భంగా ఆచార్య శ్రీనివాసరావు గారు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. “మీరు ఇక్కడ చదువుకోవడం, క్షేమంగా ఉండటమే మాకు ముఖ్యం. ఏ చిన్న సమస్య వచ్చినా సందేహించకుండా నేరుగా నాకే తెలియజేయండి,” అని చెబుతూ తన వ్యక్తిగత ఫోన్ నంబర్ను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం విషయంలో రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తుఫాను సమయంలో అధికారులే స్వయంగా వచ్చి యోగక్షేమాలు తెలుసుకోవడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.