
*రాష్ట్రంలో 603 కోట్లతో 498 ఆలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నాం*
*నెల్లూరుజిల్లాలో 58 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.118.45 కోట్లు*
*దేవాదాయ అధికారులందరూ చిత్తశుద్దితో పనిచేసి ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి*
*: దేవాదాయశాఖ సమీక్షలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*
*భక్తులకు దేవాదాయశాఖపై నమ్మకం కలిగించేలా ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి*
*ఆలయాల్లో జరిగే తప్పులను భగవంతుడు చూస్తున్నాడనే భయం, భక్తితో పనిచేయాలి*
*సమాజ హితం కోసం పనిచేసే శాఖ దేవాదాయశాఖ*
*అధికారం చేపట్టిన 18 నెలల్లో అనేక సంస్కరణలతో దేవాదాయశాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం*
*రాష్ట్రంలో ఆలయాలను ఆధ్యాతిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం*
*కోట్లాది రూపాయలతో పురాతన ఆలయాల పునర్నిర్మాణ పనులు*
*రాష్ట్రంలో 603 కోట్లతో 498 ఆలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నాం*
*నెల్లూరుజిల్లాలో 58 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.118.45 కోట్లు*
*దేవాదాయ అధికారులందరూ చిత్తశుద్దితో పనిచేసి ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి*
*➖ దేవాదాయశాఖ సమీక్షలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*
నెల్లూరు, నవంబర్ 18 : భక్తులకు దేవాదాయశాఖపై నమ్మకం, భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయశాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఆలయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం ఉదయం నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో నెల్లూరుజిల్లాలోని దేవాదాయశాఖ అధికారులు, ఇంజనీర్లు, స్తపథులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆలయాల పునర్నిర్మాణ పనులు, ధూపదీప నైవేద్యం పథకం అమలు, గ్రామదేవతల ఆలయాల నిర్మాణాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ఆలయాల ప్రతిష్ట దిగజారిందని, మళ్లీ తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలల్లోనే ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి, ఆలయాల పవిత్రతను కాపాడుతూ భక్తులకు భగవంతుని సాక్షాత్కారం చేయడమే ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ధూపదీప నైవేద్యం స్కీం ద్వారా చిన్న ఆలయాలకు ఇస్తున్న రూ.5వేల నగదును రూ.10వేలకు పెంచి అందిస్తున్నట్లు చెప్పారు. ఆలయాల్లోని అర్చకులకు రూ.10వేలు నుంచి రూ.15వేలు పెంచి అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 27వేల ఆలయాలున్న మంత్రి, ప్రతి ఆలయం బాధ్యతను ప్రభుత్వం తీసుకుని, ఆ ఆలయాల ఆలనాపాలన చూస్తుందన్నారు. ఆలయాలకు పాలకవర్గాలను కూడా నియమిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం నియమించిన పాలకవర్గాల గడువు సమయం తీరే వరకు కూడా ఆ పాలకవర్గాలనే కొనసాగించాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారని చెప్పారు. కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం పాల్పడదని, ప్రోత్సహించదని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. పారదర్శకంగానే పాలకవర్గాలను నియమిస్తున్నట్లు చెప్పారు. ఆలయాలను మంచి ఆలోచనా దృక్పథంతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లు చెప్పారు.
*కాశీ బుగ్గ తరహా ఘటనలు జరగకుండా చర్యలు*
కాశీ బుగ్గ తరహా ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ప్రైవేటు ఆలయ నిర్మాణాలపై దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండేలా త్వరలోనే చట్టం తీసుకొస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే అన్ని జిల్లాల్లో ప్రైవేటు ఆలయాల జాబితాను సిద్ధం చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, దేవాదాయ శాఖ అధికారుల వద్ద ఉంచుకోవాలని, ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, పండుగల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకారం అందించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు.
*ఆలయాల్లో ఏ తప్పులు జరిగినా శిక్షలు తప్పవు*
భగవంతుని ఆరాధ కేంద్రాలైన ఆలయాల్లో ఎవరు ఎటువంటి తప్పులు చేసిన శిక్షలు తప్పవని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆగమశాస్త్ర విషయాల్లో కేవలం వేదపండితులు, ఆలయ అర్చకులకే పూర్తి నిర్ణయాధికారులు ఉంటాయని, అధికారయంత్రాంగానికి స్థానం లేదని, కేవలం పరిపాలనాపరమైన అంశాల్లో మాత్రమే అధికారుల ప్రమేయం ఉండేలా చట్టం తీసుకొచ్చినట్లు చెప్పారు. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో కల్తీ నెయ్యి, పరకామణి దోపిడీ విషయాల్లో గత ప్రభుత్వ పాలకుల అక్రమాలు వెలుగుచూశాయని, ఇకనైన బాధ్యతగా ప్రవర్తించాలని హితవు పలికారు. ఆలయాల్లో తప్పులు జరిగితే భగవంతుడూ చూస్తూ ఉంటాడన్న భయం, భక్తి, శ్రద్ధతో ఆలయాల అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
*రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పునర్నిర్మాణ పనులకు నిధులు మంజూరు*
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పురాతన, చారిత్రాత్మక ఆలయాల పునర్నిర్మాణాలకు కోట్లాది రూపాయలను మంజూరుచేసినట్లు చెప్పారు. గత 15 ఏళ్లలో 210 ఆలయాలకు 234 కోట్లు మంజూరు చేస్తే, తమ ప్రభుత్వం కేవలం ఈ 18నెలల పాలనలో 288 ఆలయాలకు 221 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో ఉన్న పాతవి, తాము మంజూరు చేసినవి అన్నీ కలిపి సుమారు 498 ఆలయాల అభివృద్ధికి 603 కోట్ల రూపాయలను దేవాదాయశాఖ, దాతల సహకారంతో ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
*నెల్లూరుజిల్లాలో 58 ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు*
నెల్లూరుజిల్లాలో 58 ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఒక్క నెల్లూరుజిల్లాలోనే 118.45 కోట్ల నిధులను ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ధూపదీప నైవేద్యం స్కీం ద్వారా జిల్లాలో 141 ఆలయాలకు ప్రతినెలా రూ.10వేలు అర్చకుని ఖాతాకు జమ చేస్తున్నట్లు చెప్పారు. సోమశిల సోమేశ్వరస్వామి, అమ్మవారి ఆలయాలు, నెల్లూరు వేణుగోపాలస్వామి, నవాబుపేట శివాలయం, ఇరుకళల అమ్మవారి ఆలయం, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, ఉదయగిరిలోని వేణుగోపాలస్వామి ఆలయం, నర్రవాడ వెంగమాంబ ఆలయం, బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలోని గ్రామదేవతల ఆలయాలు, రామాలయాల నిర్మాణాలు, మరమ్మతులకు 5 లక్షలు చొప్పున 78 ఆలయాలకు నిధులు మంజూరు చేశామని, వీటి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఆలయాలను అభివృద్ధి చేస్తూ, సనాతన హింధూధర్మం, ఆలయాల పవిత్రతను కాపాడుతూ భక్తుల జయజయధ్వానాలతో ఆలయాలు ఆధ్యాతిక కేంద్రాలుగా దేదీప్యమానంగా వెలుగొందేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పునరుద్ధాటించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా దేవాదాయశాఖ అధికారి కోవూరు జనార్దన్రెడ్డి, అన్ని ఆలయాల ఈవోలు, ఇంజనీర్లు, స్తపథులు తదితరులు పాల్గొన్నారు.
*DIPRO, I&PR, NELLORE*