
*ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదలకు మేలు*
*జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల*
*డీసీ పల్లిలో పింఛన్లు అందజేసిన కలెక్టర్*
డీసీ పల్లి, నవంబర్ 1 : ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థికంగా భరోసా కలుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. శనివారం మర్రిపాడు మండలం డీసీ పల్లి గ్రామంలో మండల అధికారులు, సచివాలయాల సిబ్బందితో కలిసి కలెక్టర్ ఎన్టిఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతినెలా 1వ తేదీన పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందన్నారు. ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందించడం పట్ల లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా పింఛన్లు అందిస్తున్నామని, ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ చేసి నూరుశాతం పింఛన్లు మొదటిరోజే పూర్తయ్యేలా జిల్లా అధికారులు, సచివాలయాల సిబ్బంది పనిచేస్తున్నట్లు చెప్పారు. రూ.4వేలు నుంచి రూ.15వేల వరకు అందిస్తున్న పింఛన్ సొమ్ము వలన లబ్ధిదారుల కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.
*మొంథా తుపానులో జిల్లా యంత్రాంగం పనితీరు భేష్*
జిల్లాలో ఇటీవల సంభవించిన మొంథా తుపాను సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని కలెక్టర్ హిమాన్షు శుక్ల చెప్పారు. తుపాను సమయంలో ముందస్తుగా తీసుకున్న చర్యల వలన పెద్దగా నష్టం జరగలేదన్నారు. జిల్లాలో మంచి పనితీరు కనబరిచిన అధికారులకు ముఖ్యమంత్రి అవార్డులు ప్రదానం చేశారన్న కలెక్టర్, ఇది అందరికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.