మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం: 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం – బీజేపీ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్
నెల్లూరు: “సైప్రస్ పర్యటనలో ఉన్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ లభించడం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన అరుదైన గౌరవం” అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ పురస్కారం భారత దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో మరింత ఇనుమడింపజేసిందని ఆయన పేర్కొన్నారు.
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ చేతుల మీదుగా ప్రధానమంత్రి మోదీ ఈ పురస్కారాన్ని అందుకున్నారని, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ తొలి అధ్యక్షుడు మకరియోస్ 3 పేరుతో ఈ అత్యున్నత పురస్కారాన్ని ఏర్పాటు చేశారని ప్రవీణ్ కుమార్ వివరించారు. “ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ప్రధానమంత్రి మోదీ గారు ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించడం ఆయన నిరాడంబరతకు, దూరదృష్టికి నిదర్శనం” అని ఆయన కొనియాడారు.
“సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని పేర్కొనడం మనందరికీ గర్వకారణం. ఇరుదేశాల సంస్కృతి, సోదరభావం, ‘వసుదైవ కుటుంబం’ భావనకు ఇది ప్రతీక అని ఆయన చెప్పడం భారత్ ప్రపంచ శాంతికి, సహకారానికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేస్తుంది” అని చిలక ప్రవీణ్ కుమార్ అన్నారు.
రెండు దశాబ్దాల తర్వాత సైప్రస్లో భారత ప్రధాని ఒకరు పర్యటించడం ఇదే ప్రథమమని గుర్తు చేస్తూ, “ఈ పర్యటన ఇరు దేశాల మధ్య క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాలతో బలమైన సంబంధాలను నిర్మిస్తూ ముందుకు సాగుతోంది” అని ఆయన అన్నారు.