రామలింగాపురం అండర్ బ్రిడ్జి రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలి: బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ డిమాండ్
నెల్లూరు, జూన్ 14:
రామలింగాపురం అండర్ బ్రిడ్జి పరిసర రహదారి బాగా దెబ్బతిన్న కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వాహనాలు స్కిడ్ అవుతూ ప్రమాదాలకు గురవుతున్నాయని బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రోడ్డుపై అనేక గుంతలు ఏర్పడాయి. వర్షాకాలం కారణంగా నీరు నిల్వ ఉండటం వల్ల రోడ్డు మరింత జారుడు మారిపోయింది. దీనివల్ల ఇప్పటికే కొన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రజల ప్రాణాలతో ఆటలాడే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతం ద్వారా ప్రతి రోజు కొన్ని వేల వాహనాలు , స్కూల్ పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో సంబంధిత ఆర్ అండ్ బి శాఖ /మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణం స్పందించి, రోడ్డు మరమ్మతులు చేపట్టాలి.”
“తాత్కాలికంగా గుంతలు పూడ్చడమే కాకుండా, దీర్ఘకాలిక పరిష్కారం కోసం రోడ్డు పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది. డ్రెయినేజ్ సదుపాయం లేకపోవడం వల్లే ఈ సమస్య మరింత ముదిరింది. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అధికారులు వెంటనే సైట్ను పరిశీలించి చర్యలు చేపట్టాలి,” అని ఆయన కోరారు.
ప్రజలు ఈ అంశంపై అప్రమత్తంగా ఉండి, తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని చిలకా ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.