షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకోండి

– అసెంబ్లీలో ప్రభుత్వానికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విజ్ఞప్తి

– గత ఎమ్మెల్యే కమిషన్ల కోసం బకాయిలు నిలిపివేశారు
– బకాయిలు చెల్లించి, భూమిని సద్వినియోగం చేసుకోవాలి

కోవూరులో 124 ఎకరాల్లో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికులకు ఆదుకోవాల్సిన అవసరం ఉందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆమె కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ అంశంపై మాట్లాడారు. షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకుని, వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీలో గతంలో మూడు వేల మంది కార్మికులు పనిచేసేవారన్నారు. వారిలో చాలామంది ఇప్పటికే మరణించారని చెప్పారు. పనిచేసిన కార్మికుల జీతాల బకాయిలు రూ.20 కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుతిరిగే మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కమిషన్ల కోసం కార్మికుల బకాయిలు చెల్లించుకుండా నిలిపివేశారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కార్మికుల బకాయిలు చెల్లించి వారిని ఆదుకోవాలన్నారు. అదేవిధంగా 124 ఎకరాల షుగర్‌ ఫ్యాక్టరీ భూములను సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచుకునే వీలుందని, ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చామన్నారు.

కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో వేలాది ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఇందులో సరైన మౌలిక సదుపాయాలు లేక కంపెనీలు సరిగా రావడం లేదన్నారు. సెజ్‌లో సదుపాయాలు కల్పిస్తే పరిశ్రమలు తరలివచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుతాయని, ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed