2025-26 సంవత్సరపు ఆర్థిక బడ్జెట్ ఆమోదం
– బడ్జెట్ సమావేశంలో మేయర్ పి. స్రవంతి జయవర్థన్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి తెలిపారు.
నగర పాలక సంస్థ సర్వసభ్య వార్షిక బడ్జెట్ సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు.
మేయర్ స్రవంతి జయవర్ధన్
అధ్యక్షతన 2025-26 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు ప్రారంభ నిల్వ రూ. 121,30,89,764 కోట్ల రూపాయలతో, జమలు రూ. 585,48,20,000 కోట్లతో కలిపి మొత్తం రూ. 706,79,09,764 కోట్లు జమలు గా ప్రతిపాదించి దానికి అనుగుణంగా రూ.695,95,46,000 కోట్ల రూపాయల ఖర్చులను అంచనా వేసి బడ్జెట్ ను ప్రవేశపెట్టి, సర్వసభ్యుల ఆమోదమును కౌన్సిల్ తీర్మానం నెం 437 ద్వారా ఆమోదించారు.
నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను కేటాయించామని మేయర్ తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నగర పాలక సంస్థ బడ్జెట్ కేటాయింపులు చేపట్టామని, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపేందుకు ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ ను రూపొందించి ఆమోదించామని మేయర్ ప్రకటించారు.
విభాగాల వారీగా రూపొందించిన బడ్జెట్లో నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనులకు ప్రాధాన్యం కల్పిస్తూ కేటాయింపులు జరిపామని, అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని మేయర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ తహసీన్, వివిధ డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్య తేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.