వీధి దీపాల నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి
– కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలను అమర్చి వాటి నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక 25 వ డివిజన్ బుజ బుజ నెల్లూరు పరిసర ప్రాంతాలలో కమిషనర్ గురువారం పర్యటించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని వీధుల్లో క్రమంతప్పకుండా డ్రైన్ కాలువల పూడికతీత, సిల్టు ఎత్తివేత పనులను చేపట్టాలని సూచించారు. డ్రైను కాలువలు, రోడ్లు నిర్మాణం అవసరమైన ప్రాంతాలను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలని కమిషనర్ సూచించారు.
వార్డు సచివాలయ భవనాలకు తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేసి సచివాలయం ద్వారా అందించే పౌర సేవలు, కార్యదర్శుల విధివిధానాలను ప్రదర్శించాలని కమిషనర్ ఆదేశించారు.
బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి తొలి దశగా హెచ్చరించాలని పునరావృత్తం చేస్తే భారీ స్థాయిలో జరిమానాలు విధించాలని కమిషనర్ ఆదేశించారు.
డివిజన్ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
అనంతరం స్థానిక డైకాస్ రోడ్డు వెంగళరావు నగర్ సమీపంలోని అన్న క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించారు. క్యాంటీన్లో ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి టోకెన్ విధానం ద్వారానే ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ. శేషగిరిరావు, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.