వీఎస్‌యూలో ఘనంగా ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం
సామూహిక గీతాలాపనతో మార్మోగిన ప్రాంగణం

నెల్లూరు (విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం):

“వందే మాతరం” గీతం ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్‌యూ) ప్రాంగణంలో శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది “వందే మాతరం” గీతాన్ని సామూహికంగా ఆలపించారు. వారి గీతాలాపనతో క్యాంపస్ ప్రాంగణం దేశభక్తితో నిండిపోయింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, “వందే మాతరం” గీతం భారత స్వాతంత్ర్య సమరయోధులలో దేశభక్తిని జ్వలింపజేసిన ఒక అజరామర గీతమని కొనియాడారు. బంకిమ్ చంద్ర చట్టర్జీ కలం నుండి జాలువారిన ఈ గీతం, భారతమాత కీర్తి ప్రతిష్ఠలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.

ఈ గీతం మనందరిలో దేశప్రేమ, ఐక్యత, త్యాగస్ఫూర్తి వంటి ఉన్నతమైన విలువలను పెంపొందిస్తుందని ఉపకులపతి పేర్కొన్నారు. విద్యార్థులు ఈ ఆదర్శ విలువలను తమ జీవితాల్లో అలవర్చుకుని, దేశాభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.హెచ్. విజయ, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్. మధుమతి, ఎన్.ఎస్.ఎస్. సమన్వయకర్త డాక్టర్ అల్లం ఉదయ శంకర్, డాక్టర్ ఆర్ వి ఎస్ ఎస్ నాగభూషణ రావు, డాక్టర్ సిహెచ్ ప్రసూనా మరియు వివిధ విభాగాల డీన్లు, ప్రొఫెసర్లు, అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *