మొండి బకాయిదారుల తాగునీటి కనెక్షన్లు తొలగించండి
– డిప్యూటీ కమిషనర్ చెన్నుడు
నగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను మొండి బకాయి దారుల గృహాలకు సంబంధించి తాగునీటి కులాయి కనెక్షన్లను తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు రెవెన్యూ విభాగం సిబ్బందిని ఆదేశించారు.
నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ
పన్నుల వసూళ్లకై వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులను సమన్వయం చేసుకొని తాగునీటి కొళాయిల కనెక్షన్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సచివాలయాల పరిధిలో ప్రతి ఒక్క అడ్మిన్ కార్యదర్శి దైనందిన నిర్దేశించిన టార్గెట్లను పన్ను వసూళ్లకు సంబంధించిన వివరాలను సంబంధిత ఆర్.ఐ. కి ప్రతిరోజు నివేదించాలని సూచించారు.
పన్నుల వసూళ్లకు ప్రతిరోజు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. పన్ను బకాయిలు ఉన్న ప్రతి ఒక్క ఆస్తి యజమానికి తుది నోటీసులు జారీ చేసి బకాయిలు రాబట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికంగా అందుబాటులో లేని భవన యజమానులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆన్లైన్ పేమెంట్ చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వసూలు చేయాలని నిర్దేశించారు. మొండి బకాయిదారులను గుర్తించి మున్సిపల్ చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.