*ప్రతిరోజూ లక్ష ఉపాధిహామీ పనిదినాలు లక్ష్యంగా పనిచేయండి : వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆనంద్*
– మంజూరైన ప్రతి సిమెంటు రోడ్డు వేగంగా పూర్తి కావాలి
– ఎస్టిలకు ఆధార్కార్డులు ఇప్పించడం మన కనీస బాధ్యత
– మార్చిలోగా గృహనిర్మాణాల పూర్తికి చర్యలు
– పిఎం సూర్యఘర్ యోజనపై అవగాహన కల్పించండి
– వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆనంద్
నెల్లూరు, జనవరి 6 : ప్రతిరోజూ లక్ష పనిదినాలు లక్ష్యంగా ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఉపాధిహామీ, ఆర్డబ్ల్యుఎస్, హౌసింగ్, పంచాయతీ రాజ్ సీసీ రోడ్ల గ్రౌండింగ్, ఎంఎస్ఎంఈ సర్వే, ఎస్టీలకు ఆధార్కార్డుల జారీ, పిఎం సూర్యఘర్ యోజన పథకం అమలు మొదలైన అంశాలపై సబ్కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పనుల వేగం పెంచాలని, ప్రతిరోజూ లక్ష పనిదినాలు లక్ష్యంగా ఎంపిడివోలు, ఎపివోలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సిసి రోడ్లు, కెటిల్ షెడ్ల నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఆర్డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీలలో చేపట్టిన మంచినీటి వసతి సౌకర్యం, టాయిలెట్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మార్చిలోగా 10369 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందని, ఈ మేరకు హౌసింగ్ అధికారులు ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. హౌసింగ్ లేఅవుట్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. సిమెంటు, ఇసుకకు ఎటువంటి ఇబ్బంది లేదని, బిల్లులు కూడా సకాలంలో మంజూరవుతున్నాయని చెప్పారు. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో సిసి రోడ్లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, అలాగే సిమెంటురోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినా కూడా ఇంకా మొదలుపెట్టని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రోడ్డు నిర్మాణం కూడా మొదలై పనులు వేగంగా జరగాలని ఆదేశించారు. ఆధార్ కార్డులు లేక ఎటువంటి ప్రభుత్వ రాయితీలు పొందలేకపోతున్న ఎస్టిల పట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని, వారికి ఆధార్ కార్డులు ఇప్పించడం మన కనీస బాధ్యతగా భావించాలని కలెక్టర్ అన్నారు. నాన్ అవైలబులిటీ, ఎల్ఆర్బిడి సర్టిఫికెట్లు ఇచ్చి బర్త్ సర్టిఫికెటు మంజూరు చేయాలన్నారు. బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా వెంటనే ఎస్టిలకు ఆధార్కార్డులను ఇప్పించేందుకు ఆర్డీవోలు ప్రత్యేకంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. పిఎం సూర్యఘర్ యోజన పథకంపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజూ ఒక్కొక్క సెక్షన్ పరిధిలో 5 దరఖాస్తులు చేయించాలన్నారు. రిజిస్ట్రేషన్, వెండర్ సెలక్షన్, సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్, సబ్సిడీ మెదలైన దశలను పక్కాగా అమలు చేయాలన్నారు. గ్రామ వార్డు సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ సర్వే, ఎం ఎస్ ఎం ఈ సర్వేను పూర్తి చేసేందుకు ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. హౌస్హోల్డ్లో మిస్సయిన సుమారు 40వేల మంది విద్యార్థులను ఆయా పాఠశాలల హెచ్ఎంలు సమీప సచివాలయ సిబ్బంది సహకారంతో మ్యాపింగ్ చేయించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్, డిఆర్వో ఉదయభాస్కర్ , జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి , జడ్పీ డిప్యూటీ సీఈవో మోహన్రావు, హౌసింగ్, డ్వామా, డిఆర్డిఎ పిడి లు వేణుగోపాల్ , గంగా భవాని, నాగరాజకుమారి, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు విజయన్, వెంకట రమణ, డిఎంఅండ్హెచ్వో సుజాత, పరిశ్రమలశాఖ జిఎం మారుతీ ప్రసాద్, డీఈవో బాలాజీ రావు, సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
( జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది )