
నిర్దిష్ట గడువులోపు పరిష్కారాలను అందించండి
– అదనపు కమిషనర్ నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లనుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను అదనపు కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అదనపు కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహాలు క్యాన్సిల్ అయిన వారికి వారు చెల్లించిన మొత్తాలను తిరిగి చెల్లించడంతోపాటు, ఆయా గృహాలను నూతన లబ్ధిదారులకు కేటాయించనున్నామని తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ప్రజలనుంచి ఎక్కువగా రోడ్ల మరమ్మతు పనులు, నూతన రోడ్ల మంజూరు, నూతనంగా డ్రైను కాలువల నిర్మాణం కోసం విజ్ఞాపనలు అందుకున్నామని తెలిపారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి అసెస్మెంట్ నెంబర్లలో చిన్నపాటి సవరణలు, మార్పు, చేర్పులను గురించి ఎక్కువగా వినతులు అందుకున్నామని వెల్లడించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి రోడ్డు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల గురించి, మార్టగేజ్ విడుదల గురించి అర్జీలు అందుకున్నామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విభాగాల వారీగా ఇంజనీరింగ్ – 9, హౌసింగ్ – 17, టౌన్ ప్లానింగ్ – 9, రెవెన్యూ – 1, పబ్లిక్ హెల్త్ – 4, డి.ఈ.ఓ – 1, మొత్తం – 41 ఫిర్యాదులను అందుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సి.పి పద్మజ, మేనేజర్ ఇనాయతుల్లా, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరెంటెండెంట్ లు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.