
*తీర ప్రాంతాల్లో భూగర్భజల కాలుష్యం, ఉప్పుదనం సమస్యపై కేంద్ర చర్యలు ఏమిటి? – రాజ్యసభలో శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్*
న్యూఢిల్లీ, మార్చి 30, 2026:
దేశంలోని తీర ప్రాంతాల్లో భూగర్భజల కాలుష్యం మరియు సముద్రపు నీటి చొరబాటు (సాలినిటీ) సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందా? ప్రభావిత జిల్లాలు ఏవి? అలాగే ఈ సమస్యపై కేంద్ర భూగర్భజల మండలి (CGWB) నిర్వహించిన అధ్యయనాలు, నివేదికల ముఖ్య అంశాలు ఏమిటి? అనే విషయాలపై రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు రాజ్యసభలో ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌదరి గారు సమాధానం ఇస్తూ, దేశవ్యాప్తంగా భూగర్భజల నాణ్యతను కేంద్ర భూగర్భజల మండలి (CGWB) మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో భూగర్భజల ఉప్పుదనం ప్రధానంగా అధిక భూగర్భజల వినియోగం వల్ల సముద్రపు నీరు లోనికి చొరబడటం కారణమని వెల్లడించారు.
మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తీర ప్రాంతాల్లో ఉప్పుదనం ప్రభావం ఉన్నట్లు కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నారు .
కేంద్ర భూగర్భజల మండలి NAQUIM 2.0 కార్యక్రమం కింద తీర ప్రాంతాల్లో శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహిస్తూ భూగర్భజల కాలుష్యం, కారణాలు మరియు ధోరణులపై విశ్లేషణ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పులు, భౌగోళిక లక్షణాలు కూడా ఈ సమస్యపై ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు .
2025 భూగర్భజల నాణ్యత నివేదిక ప్రకారం తీర రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్, ఇనుము వంటి కాలుష్య పరిమాణాలు అనుమతించిన స్థాయిని మించి ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 24.23% నమూనాల్లో నైట్రేట్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు .
ఈ సందర్భంగా శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో భూగర్భజల కాలుష్యం ప్రజారోగ్యానికి మరియు వ్యవసాయానికి తీవ్రమైన ప్రమాదంగా మారుతున్నదని తెలిపారు. భూగర్భజల వినియోగ నియంత్రణ, ఆర్టిఫిషియల్ రీచార్జ్ ప్రాజెక్టులు, శాస్త్రీయ పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
—*శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారి కార్యాలయం, నెల్లూరు*