డ్రైను కాలువలను ఆక్రమిస్తూ శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దు
– కమిషనర్ వై.ఓ. నందన్
నగరపాలక సంస్థ పరిధిలో డ్రైను కాలువలను ఆక్రమిస్తూ సమీప గృహాల వారు ఏలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టరాదని, డ్రైను కాలువల పూడికతీత పనులకు అడ్డంకిగా ఉంటే ఇంటికి సంబంధించిన మెట్లు, ర్యాంపులు, తదితర నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 7వ డివిజన్ నవాబుపేట, చాకలి వీధి, శెట్టిగుంట రోడ్డు, లక్ష్మీపురం, గమళ్ల వీధి తదితర ప్రాంతాలలో ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ విభాగం, వార్డ్ సచివాలయ కార్యదర్శులతో కలిసి కమిషనర్ బుధవారం పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి. నారాయణ, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ల సూచనల మేరకు సుమారుగా ఒకటిన్నర కోటి రూపాయలతో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా డ్రైను కాలువల పూడికతీత పనులతో పాటు పూర్తిస్థాయిలో సిల్ట్ తొలగించేందుకు నగరం మొత్తం చిన్న, పెద్ద కాలువల్లో మొత్తం డీసిల్టేషన్ పని మొదలుపెట్టామని తెలిపారు. అన్ని డివిజన్లలో గ్యాంగ్ వర్క్ చేపట్టి డ్రైను కాలువలను ఆక్రమిస్తూ నిర్మించిన ఆక్రమణలు, ర్యాంపులు, మెట్లను తొలగించి వంద శాతం సిల్ట్ తొలగింపు పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి పేరుకుపోయిన సిల్ట్ ను మిషన్ల సహాయంతో తొలగించడంతో దోమల ఎదుగుదలకు అవకాశం లేకుండా పోయిందని, దోమల పూర్తి నిర్మూలనకు పూడికతీత పనులు ఉపయుక్తమవుతాయని కమిషనర్ తెలిపారు.
చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే గృహ వ్యర్ధాలను అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను వేస్తే జరిమానాలతో పాటు అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
అన్ని డివిజన్లలో క్రమం తప్పకుండా డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులను చేపట్టాలని, తడి పొడి చెత్తను విడివిడిగా సేకరించేలా సిబ్బందిని పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
నూతన భవనాలకు సంబంధించిన అసెస్మెంట్ ను పరిశీలించి, పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ద్వారా కొలతలు వేయించి పన్ను డిమాండ్ నోటీసులను తనిఖీ చేశారు. నూతన భవన నిర్మాణాల వద్ద బిల్డింగ్ ప్లాన్, అనుమతులను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
నవాబుపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రం, రైతు బజార్ లను కమిషనర్ సందర్శించారు. రైతు బజార్ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించి సిబ్బందికి వివిధ సూచనలను జారీ చేశారు.
అనంతరం స్థానిక ఆత్మకూరు బస్టాండు కూడలి నుంచి స్టోన్ హౌస్ పేటకు వెళ్లే ప్రధాన మూడు మార్గాలను బ్లాక్ చేస్తూ ఆక్రమించిన వీధి వ్యాపారాల దుకాణాలను, తోపుడుబండ్లను కమిషనర్ తొలగించారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వారిని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డి.ఈ రఘురామ్, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డ్ సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.