
*కరేడు రైతుల కోసం ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరిన రామచంద్రయాదవ్*
– కరేడు రైతుల తరుపున తుది వినతి
– బలవంతపు భూసేకరణ ఆపకపోతే ఆమరణ నిరాహార దీక్ష
– చంద్రబాబుకు లేఖ రాసిన బిసివై పార్టీ అధినేత రామచంద్రయాదవ్
కరేడు రైతులకు న్యాయం చేయడంతో పాటు బలవంతపు భూసేకరణ నిలుపుదల చేసేందుకు రైతుల సమస్యలను విన్నవించుకునేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఎపి సిఎం చంద్రబాబుకు నాయుడకు బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ లేఖ రాశారు. కరేడు రైతుల తరుపున తుది వినతిగా పరిగణించాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి బినామీ సంస్థగా అభివర్ణించిన చంద్రబాబు నాయుడే అదే కంపెనీకి వేల ఎకరాల భూములను ఎలా ఇస్తారని ప్రశ్నించారు? వేలాది మంది రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నా ఎందుకు స్పందించడం లేదన్నారు. రైతులు ఉద్యమం చేస్తుంటే… ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు బలవంతపు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోందన్నారు. కరేడు రైతుల సమస్యలను విన్నవించుకునేందుకు వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. గతంలో తనకు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు రైతుల సమస్యల పట్ల అయినా సానుకూలంగా స్పందించాలన్నారు. తనను చూడటానికి మొహం చెల్లకపోయినా కనీసం రైతులతో అయినా భేటీ కావాలని కోరారు. గతంలో కూడా టిటిడి డెయిరీ విషయంలో అపాయింట్ మెంట్ కోరితే కనీసం స్పందించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇండోసోల్ వ్యవహారంలో ఎంత లాలూచీ పడినా చివరగా వాస్తవాలు, చీకటి ఒప్పందాలు బయటికి వస్తాయన్న విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. కరేడు భూసేకరణ ఆపకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని రైతుల సమక్షంలో ప్రకటించిన విషయాన్ని లేఖ ద్వారా హెచ్చరించారు.