*ఇక తెలుగులోనూ కీలక నిర్ణయం తీసుకొన్న ఏపీ ప్రభుత్వం*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ మేరకు వివిధ శాఖలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది
మొదట ఇంగ్లీష్లో ఉత్తర్వులు ఇచ్చి అప్లోడ్ చేయాలని.. ఆ తర్వాత రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వులు జారీకి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది. ఉత్తర్వుల అనువాదానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలు వినియోగించుకోవాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు