
*ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలలో దుబారా ఖర్చులు తగ్గించి, కార్పొరేషన్ వనరులు వృధా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించిన నెల్లూరు నగరపాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్*
నెల్లూరు నగరపాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో కమిషనర్ తో పాటు అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు ప్రతి ఒక్క అధికారి మనస్ఫూర్తిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు వారికి సంబంధించిన ఆదాయ మార్గాలలో మరింత ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకొని కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడాలని సూచించారు.
ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలలో దుబారా ఖర్చులు తగ్గించి, కార్పొరేషన్ వనరులు వృధా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం కమిషనర్ వై.ఓ నందన్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ పరకాల అమలు ద్వారా రాబడిని పెంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నామని వివరించారు. మొండి బకాయి లకు సంబంధించిన ఆస్తిపన్నులు, తాగునీటి కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులను వసూలు చేసేందుకు లోక్ అదాలత్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నామని కమిషనర్ తెలియజేశారు.
ఈ సమావేశంలో సిటీ ప్లానర్ హిమబిందు, సెక్రటరీ శ్రీలక్ష్మి, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, టి.పి.ఆర్.ఓ వాసు బాబు, మేనేజర్ రాజేశ్వరి, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ లు శేషగిరిరావు, రహంతు జానీ, అనిల్ కుమార్, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు పాల్గొన్నారు.