*ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి*
*- డిప్యూటీ కమిషనర్ చెన్నుడు*
నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను, కొళాయి పన్నులు,ఖాళీ స్థలం పన్ను, మున్సిపల్ షాపు రూముల బాడుగల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, వంద శాతం లక్ష్యాలను సాధించాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.
నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల పైబడి బకాయి ఉన్న యజమానులను కలిసి బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు వారి నుంచి ఎందుకు వసూలు చేయలేదో సహేతుకమైన కారణాలను వివరిస్తూ నివేదికలను సంబంధిత రెవిన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.
సచివాలయాల పరిధిలో ప్రతి ఒక్క అడ్మిన్ కార్యదర్శి దైనందిన టార్గెట్లను నిర్దేశించుకుని పన్ను వసూళ్లకు సంబంధించిన వివరాలను సంబంధిత ఆర్.ఐ కి ప్రతిరోజు నివేదికలను తెలియచేయాలని సూచించారు.
పన్నుల వసూళ్లకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రస్థాయిలో ఆస్తిపన్ను వసూళ్ల కొరకు పర్యటించాలని సూచించారు. పన్ను బకాయిలు ఉన్న ప్రతి ఒక్క ఆస్తి యజమానికి నోటీసులు జారీ చేసి బకాయిలు రాబట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికంగా అందుబాటులో లేని భవన యజమానులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆన్లైన్ పేమెంట్ చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ కార్యాదర్సులకు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లకు సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వసూలు చేయాలని నిర్దేశించారు. మొండి బకాయిదారులను గుర్తించి మున్సిపల్ చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.