*అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తాం : కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి*
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.
శనివారం కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
వ్యవసాయానికి సంబందించిన 79 విద్యుత్ కనెక్షన్ల కు స్విచ్ ను ఆన్ చేశారు. 60 లక్షల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేసారు. గౌరవరం సచివాలయంను, ఆరోగ్య కేంద్రంను, రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల గౌరవరం గ్రామస్తుల కల ఈరోజు నెరవేరిందని అన్నారు. పొలం ఉన్నా, పండించుకునే శక్తి ఉన్నా, డీజిల్ పెట్టి మోటార్ల ద్వారా నీటిని పొలాలకు పంపించే దుస్థితి ఉండేదని అన్నారు.
రైతు బిడ్డగా నేడు విద్యుత్ కనెక్షన్లను ప్రారంభించి మీకు అందించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. వెలుగులు నింపే విద్యుత్ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో lఉంటూ, మేమున్నామన్నా భరోసా ప్రజలకు కల్పించాలని కోరారు.
పిల్లి వాగు, చిప్పలేరు ఆధునీకరణ కొరకు ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగిందని, అన్నీ అనుకూలిస్తే జూన్ నాటికి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
రైతుల అన్ని అవసరాలు తీరుస్తామని ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయంగా గౌరవాన్ని తెచ్చిన గ్రామం గౌరవరం అని తెలిపారు. ఈ గ్రామంతో అనుబంధం ఉందని అందుకే దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు.
మీ ఇంటి బిడ్డ పోటీ చేసిన విధంగా నన్ను ఆదరించి గెలిపించినందుకు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సోమశిల జలాలు పుష్కలంగా గౌరవరానికి తీసుకొస్తానని తెలిపారు..
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపిడివో శ్రీదేవి, రూరల్ సిఐ రాజేశ్వరరావు, పంచాయతీ రాజ్ సిబ్బంది, ఎన్ఆర్ఈజిఎస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు..