*వి.ఎస్.యూ మహిళా హాస్టల్‌లో తాత్కాలిక విద్యుత్ అంతరాయం – వీసీ తక్షణ చర్యలతో పునరుద్ధరణ…*
…..
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మహిళల వసతి గృహానికి ట్రాన్స్‌ఫార్మర్ నుండి వచ్చే మెయిన్ లైన్ వాతావరణ ప్రతికూలతల కారణంగా దెబ్బతినడం వలన తాత్కాలికంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే, విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు హాస్టల్‌ను సందర్శించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. కొద్ది గంటల్లోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలా సాంకేతిక విభాగం సహకారంతో సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారు.

హాస్టల్లో ఉండే విద్యార్థుల భద్రత, దైనందిన విద్యా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా విశ్వవిద్యాలయం చురుకైన చర్యలు తీసుకోవడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సి.హెచ్. విజయ గారు, హాస్టల్ వార్డెన్లు ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించి అవసరమైన సహకారం అందించారు.

వైస్‌ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ,
“విశ్వవిద్యాలయం విద్యార్థుల సంక్షేమాన్ని మొదటి ప్రాధాన్యంగా భావిస్తుంది. అనుకోని సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారం కోసం వేగవంతమైన చర్యలను చేపట్టడమే కాకుండా, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలపై కూడా దృష్టి సారిస్తున్నాము. మహిళా హాస్టళ్ల భద్రత, సదుపాయాల విస్తరణ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం కోసం విశ్వవిద్యాలయం కట్టుబడి ఉంది,” అని తెలిపారు.

అలాగే రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ,
“విద్యార్థుల వసతి మరియు భద్రత విషయాల్లో ఎలాంటి రాజీ ఉండదు. సమస్యను తక్షణమే పరిష్కరించడంలో సంబంధిత విభాగాలు సమయోచితంగా స్పందించడం అభినందనీయం. హాస్టల్ సదుపాయాల మెరుగుదలకు పరిపాలన వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుంది,” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయం వేగవంతమైన స్పందనకు హాస్టల్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed