
మొంథా తుఫాను ప్రభావం కారణంగా నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సహాయక చర్యలను 24 గంటల పాటు అందించేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నిర్వహణ తీరును కమిషనర్ వై.ఓ నందన్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు.
సహాయక చర్యల హెల్ప్ లైన్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హాజరు వివరాలను తనిఖీ చేశారు. హెల్ప్ లైన్ నెంబర్లకు వచ్చే సమాచారాన్ని సంబంధిత విభాగం అధికారులకు వెంటనే చేరవేసి, సహాయక పనులు వేగవంతంగా పూర్తి అయ్యేవరకు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేస్తున్న వారి పూర్తి వివరాలను సేకరించి వారి సమస్య తీవ్రతను అర్థం చేసుకుని తక్షణమే స్పందించాలని కమిషనర్ సూచించారు.
అనంతరం స్థానిక బాలాజీ నగర్ బాజీ తోట ప్రాంతంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కేంద్రంలో వరద ముంపు ప్రాంతాల నుంచి పునరావాసానికి తరలించిన ప్రజలకు అందుతున్న వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు కమిషనర్ వెంట పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.