
*ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత – వేమిరెడ్డి దంపతులు*
విదేశీ పాలన నుంచి స్వతంత్ర పాలన దిశగా సాగిన పోరాట ఫలితమే గణతంత్ర రాజ్య స్థాపన అని, రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అన్నారు.
జిల్లా ప్రజలకు, అధికారులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన మహా నాయకుల త్యాగాలు నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించినా జనవరి 26, 1950 వరకు బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టాల ద్వారానే పరిపాలన సాగేదన్నారు.
భారత పౌరులందరు స్వరాజ్య ఫలాలు పొంది అందరికి సమ న్యాయం జరిగే దిశగా రూపొందించిన రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చిన సందర్భంగా దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించుకున్నట్లు తెలిపారు.
దేశంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి బద్ధులై ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నందుకు గర్వపడాలన్నారు.
గణతంత్ర దేశంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.