
కాకినాడ జిల్లాలో టీడీపీ కుటుంబాల్ని వెలేసిన వైసీపీ గ్రామం..?
ఏపీలో ఆరు నెలల క్రితం అధికారం చేజిక్కించుకున్న టీడీపీకి కాకినాడ జిల్లాలో భారీ షాక్ తగిలింది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పాలించిన రాష్ట్రంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించినా టీడీపీకి క్షేత్రస్ధాయిలో మాత్రం ఇంకా పట్టు చిక్కడం లేదు. దీనికి నిదర్శనంగా కాకినాడ జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది.

కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని ఉప్పుమిల్లి గ్రామంలో ధాన్యం పాటాలు, పార్టీల విభేదాల నేపథ్యంలో ఏకంగా ఏడు టీడీపీ కుటుంబాల్ని ఊరి పెద్దలు వెలి వేశారు. గ్రామస్ధులు వారికి ఎలాంటి సహకారం అందించకూడదని, వారిని శుభకార్యాలు జరిగినా పిలవకూడదని ఆదేశాలు కూడా ఇచ్చేశారు. దీంతో వీరు గ్రామం వదిలి వెళ్లాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉండే గ్రామం కావడంతో ఇలా గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఆరు నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గతంలో వైసీపీ భారీగా సీట్లు గెల్చుకోవడంతో ఇంకా క్షేత్రస్ధాయిలో ఆ ప్రభావం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా లెక్కచేయకుండా గ్రామాల్లో వైసీపీ ఇంకా హవా కొనసాగిస్తున్నట్లు అర్దమవుతోంది. లేకపోతే అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబాల్ని ఇలా వెలివేయడం ఏంటన్న చర్చ జరుగుతోంది. దీనిపై అధికారులు రంగంలోకి దిగి వివరాలు తీసుకుంటున్నారు.