
ఇసుక రవాణాలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి
– కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక, మట్టి, డెబ్రిస్ తదితర సామాగ్రి రవాణా సందర్భంలో లారీలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల నిర్వాహకులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని రోడ్లపై వాటిని వెదజల్లకుండా తరలించాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు.
స్థానిక రేబాల వారి వీధి ప్రాంతంలో సోమవారం ఇసుకను రవాణా చేస్తున్న ఎడ్లబండిని ఆపి దాని యజమానితో కమిషనర్ మాట్లాడారు.
రవాణా సమయంలో ఇసుక రోడ్లపై పడకుండా బండికి నలువైపులా చెక్కలను, ఇసుక పైన పట్టాను కప్పుకోవాలని సూచించారు. ఇసుక, ఇతర సామాగ్రి రవాణా సమయంలో నిర్దేశించిన ప్రమాణాలను పాటించకుంటే జరిమానాలు విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు.